కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌.. ఆ డబ్బు ఏమైందో చెప్పాలి | Madhu Yaskhi Sensational Allegations Against TRS Party | Sakshi
Sakshi News home page

భద్రాచలం రాముడికి కేసీఆర్‌ టోపీ పెట్టాడు..

Apr 1 2022 4:18 PM | Updated on Apr 1 2022 4:18 PM

Madhu Yaskhi Sensational Allegations Against TRS Party - Sakshi

రైతులకు డబ్బులు ఇస్తా అని కవిత కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. అటు భద్రాచలం రాముడికి కేసీఆర్‌ టోపీ పెట్టాడు. భద్రాద్రి రాముడికి పట్టు బట్టలు కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విశ‍్వనగరం.. విష నగరంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ అన్నారు. గాంధీ భవన్‌లో శుక‍్రవారం మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కి అడ్డాగా మారింది. ఏడేళ్ల తెలంగాణ టీఆర్‌ఎస్‌ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారింది. 50 ఏండ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని అంటున్నావు కేటీఆర్‌.. ఐటీకి హైదరాబాద్‌ని హబ్‌గా చేసింది. నీ హయంలో హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్ సిటీగా మారింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియా వల్లే స్వరాష్ట్రం వచ్చింది. ఏడేళ్లలో విద్యార్థులను మత్తుకు బానిసగా మార్చేశారు.. హైదరాబాద్‌ను విష నగరం చేశారు.

రాష్ట్రంలో అన్ని ఛార్జీలు పెంచుతూ జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గుగా అనిపించడం లేదా?. కేసీఆర్‌కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోతారు.. టెస్టుల కోసం యశోద ఆసుపత్రికి వెళ్తారు. ప్రత్యేక విమానానికి పెట్టిన ఖర్చుతో ఒక ఐసీయూ ఏర్పాటు చేయొచ్చు. ప్రతీ గింజా కొంటా అని చెప్పిన కేసీఆర్... కల్లబొల్లి మాటలు ఆపి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులను నట్టేట ముంచి రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మక్కు అయ్యారు.

నిజామాబాద్‌లో రైస్ మిల్లర్లతో కల్వకుంట్ల కవిత కుమ్మక్కు అయ్యింది. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కవిత కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. పోలీసులు ట్రాఫిక్ చాలన్ల పేరుతో 250 కోట్లు వసూలు చేశారు. పబ్బుల కట్టడిని ఎందుకు పట్టించుకోవడం లేదు. కమిషనర్ సీవీ ఆనంద్ నిజాయితీ గల అధికారి.. ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా పబ్‌లలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి.

కేసీఆర్ తెలంగాణను మత్తులో ముంచతూ విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిరుద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిండా ముంచింది. అటు భద్రాచలం రాముడికి కేసీఆర్‌ టోపీ పెట్టాడు. భద్రాద్రి రాముడికి పట్టు బట్టలు కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సింది ఆందోళన కాదు.. పరిష్కారం చూపాలి. కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్.. నువ్వు అంత మొనగాడివి అయితే కేంద్రం చేత వడ్లు ఎందుకు కొనిపించడం లేదు’’ అని ప‍్రశ్నించారు.

ఇది చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు..

Advertisement
 
Advertisement
Advertisement