
సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత సంచారం
కుటుంబీకుల భయాందోళన.. బీబీపేటలో ఘటన
కల్హేర్(నారాయణఖేడ్)/ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామంలో ఓ ఇంటి కాంపౌండ్లోకి శనివా రం ఉదయం చిరుత చొరబడటం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీ పేట గ్రామానికి చెందిన కల్హేర్ మండల మాజీ జెడ్పీటీసీ స్వప్న భర్త గుండు మోహన్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి కాంపౌండ్ గేటు గొళ్లెం వేసి బయటకు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఇంట్లోని సీసీటీవీని పరిశీలిస్తున్న క్రమంలో చిరుత వెళ్లడాన్ని గుర్తించారు.
ఫుటేజీని రికార్డు చేసి ఫోన్లో గుండు మోహన్కు పంపించగా అది చిరుత పులిలా ఉందని, తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. సమాచారాన్ని గుండు మోహన్ గ్రామస్తులకు చేరవేయగా వారు ఇంటి పరిసరాల్లో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిరుత ఇంటి వెనుక కాంపౌండ్ నుంచి దూకి వెళ్లిపోయింది. కాగా, ఘటనా స్థలాన్ని మెదక్ డీఎఫ్ఓ శ్రీధర్రావు పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు.