కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ

KTR Letter To Central It Minister Ravi Shankar Prasad - Sakshi

సాక్షి, హైదరాబాద్:  నగరానికి ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కు సమానంగా నూతన హోదాను కల్పించాలని కోరుతూ ఆదివారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్కి కేటీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో..  ‘‘ గత ఆరు సంవత్సరాలుగా  హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైనా.. తెలంగాణలో మాత్రం ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. జాతీయ సగటు 1.9శాతం ఉండగా.. తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లుగా ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి,  సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీస్, బ్లాక్చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్నది.

దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఈ రంగంలో గత ఆరు సంవత్సరాల్లో నెలకొల్పబడ్డాయి’’ అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top