కేటీఆర్తో మణికంఠను మాట్లాడిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య
బోన్ కేన్సర్ బాధితుడికి కేటీఆర్ ఓదార్పు
వీడియో కాల్లో మాట్లాడించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
పెనుబల్లి: ‘తమ్ముడూ భయపడకు.. నేనున్నా, మీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తా’అంటూ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న బాలుడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు. కేటీఆర్ను చూడాలనేది తన కోరికగా వెల్లడించిన బాలుడిని వీడియోకాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడించగా ఆయన ధైర్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన బన్నే వెంకటేశ్వర్లు – దేవి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మణికంఠ ఉన్నాడు.
ఐదేళ్ల క్రితం మణికంఠ కింద పడగా కాలికి గాయమైంది. కొన్నాళ్లకు మానిపోయినా ఏడాది క్రితం అదే కాలికి వాపు రావడంతో హైదరాబాద్ తీసుకెళ్తే బోన్ కేన్సర్గా నిర్ధారించారు. రూ.లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా తగ్గకపోగా కేన్సర్ చివరి స్టేజీలో ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మణికంఠను వెంటిలేటర్ మీదే ఇంటికి తీసుకొచ్చారు. చికిత్సకోసం రోజుకు రూ.10 వేలు వెచ్చిస్తున్నారు.
మణికంఠ తన చివరి కోరికగా కేటీఆర్ను చూడాలని బంధువులతో చెప్పుకున్నాడు. ఈ విషయం తెలియడంతో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం బాలుడిని వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ‘నీకేం కాదు.. మీ కుటుంబానికి అండగా ఉంటాం. తప్పకుండా వచ్చి నిన్ను కలుస్తా’అని ధైర్యం చెబుతూ ఓదార్చారు.


