రణరంగంగా మారిన బోయిన్పల్లి పీఎస్
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్కు తరలించడంతో బోయిన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ను బోయిన్పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ను పోలీసు స్టేషన్లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.
సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
కేటీఆర్, హరీశ్రావుపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.
పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.
సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్రావుతోపాటు డి.సు«దీర్రెడ్డి, గంగుల, పాడి కౌశిక్రెడ్డి, జి.జగదీశ్వర్రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి


