సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో జాబితా
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్), 2026 కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సర్, 2026లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించకపోవడంతో వీరిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా ..ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు.
ఈ రెండు కేటగిరీల కలిపి మొత్తం 92లక్షల మంది ఓటర్లుండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి జాబితాలను మంగళవారం ఆన్లైన్లో ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్సైట్ (https://ceotelangana.nic.in) లో ఈ జాబితా అందుబాటులో ఉంది. పార్ట్నంబర్ల(పోలింగ్బూత్ నంబర్) వారీగా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. జిల్లా పేరు, నియోజకవర్గం పేరు, తమ పోలింగ్ బూత్ సంఖ్య తెలిసి ఉంటే ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. సర్–2026 ముసాయిదా జాబితాలో చాలా మంది ఓటర్ల పోలింగ్బూత్/పార్ట్ నంబర్లు మారాయి. 1050 టోల్ఫ్రీ నంబర్కు ‘ఈసీఐ ఎపిక్నంబర్’ను ఎస్ఎంఎస్ చేస్తే సంబంధిత ఓటరు కొత్త పార్ట్ నంబర్ను ఈసీ ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తుంది. దీని ద్వారా పైన పేర్కొన్న జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూడవచ్చు. వెబ్సైట్లో కొన్ని నియోజకవర్గాలు/పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జాబితాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. వాటిని తెరిచేందుకు ప్రయతి్నస్తే త్వరలో అప్లోడ్ చేస్తారనే సందేశం ప్రత్యక్షం అవుతోంది.


