ఏఈఈ (సివిల్‌) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి | KTR appeal to TGPSC Chairman Mahender Reddy | Sakshi
Sakshi News home page

ఏఈఈ (సివిల్‌) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి

Jul 4 2024 4:35 AM | Updated on Jul 4 2024 4:35 AM

KTR appeal to TGPSC Chairman Mahender Reddy

టీజీపీఎస్సీ చైర్మన్‌మహేందర్‌రెడ్డికి కేటీఆర్‌ విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ– సివిల్‌) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రక టించటంలో కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జాబితాను వెల్లడించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ పరీక్ష రాసినవారు బుధవారం కేటీఆర్‌ను కలిశారు. 

టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏఈఈ (సివిల్‌) రాత పరీక్ష నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేసిందన్నారు. 22నెలల క్రితం నోటిఫికేషన్‌ విడుదలై పరీక్ష జరిగిందని, ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన జాబితాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా విడుదల చేయడం లేదని తెలిపారు.  

నేతన్న ఆత్మహత్యపై ఆవేదన 
ఉపాధి లేక సిరిసిల్లలో చేనేత కారి్మకుడు పల్లె యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మ హత్య కాదని ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. చేనేత కారి్మకుడి కుటుంబాన్ని ఆదుకు నేందుకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదుపై ఆగ్రహం 
ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతో విపక్ష ఎమ్మెల్యేలపై అక్రమకేసులు బనాయిస్తున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్‌ ఖండించారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్‌రెడ్డి చేసిన నేరమా అని నిలదీశారు. 

అసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై ఆసిఫాబాద్‌ పీఎస్‌లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్‌ ఖండించారు. ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రొటోకాల్‌ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement