సాగర్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇంజనీర్లు  | Sakshi
Sakshi News home page

సాగర్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇంజనీర్లు 

Published Thu, Oct 7 2021 2:23 AM

KRMB Officials Inspected Nagarjuna sagar Project In Nalgonda - Sakshi

సాక్షి,పెద్దవూర(నల్లగొండ): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ (గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) పరిధిలోకి తీసుకువచ్చే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. అందులో భాగంగా గెజిట్‌ను అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గాను ఒక్కో రివర్‌ బోర్డునుంచి ఇద్దరు చొప్పున కేంద్రం నలుగురు చీఫ్‌ ఇంజనీర్లను నియమించింది. కాగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఇంజనీర్లు టీకే శివరాజన్, అనుపం ప్రసాద్‌ బుధవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు.

సాగర్‌ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం, రేడియల్‌ క్రస్ట్‌గేట్లను, గ్యాలరీలను, టెలీమెట్రీలతోపాటు స్పిల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో తదితర విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసు కున్నారు. బుధవారం రాత్రి సాగర్‌ హిల్‌కాలనీలోని అతిథిగృహంలో బసచేసి గురువారం ఉదయం పుట్టంగండి ప్రాజెక్టును, అక్కడ నుంచి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌ సందర్శనకు వెళ్లనున్నారు. వీరివెంట సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈలు సుదర్శన్‌రావు, పరమేశ్, శ్రీనివాస్‌రావు, ఏఈలు సత్యనారాయణ, రవి, కృష్ణయ్య, జైల్‌సింగ్‌ ఉన్నారు.  

టెయిల్‌ పాండ్‌ పరిశీలన: నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండంలోని టెయిల్‌పాండ్‌ను బుధవారం కేఆర్‌ఎంబీ ఇంజనీర్లు సందర్శించారు. టెయిల్‌ పాండ్‌ డ్యాంను, డ్యాం గేట్లు, పవర్‌ హౌస్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు

Advertisement
Advertisement