దేశ సగటుకు రెండింతలకుపైగా రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యలు
ఐసీఎంఆర్–ఇండియాబ్ అధ్యయనం హెచ్చరిక
తెలంగాణలో 7.4% మందికి కిడ్నీ పనితీరు లోపం..జాతీయ సగటు 3.2% మాత్రమే
ప్రతి 14 మందిలో ఒకరికి కిడ్నీ పనితీరు లోపం
మధుమేహం, రక్తపోటే ప్రధాన కారణాలు
మూత్ర పిండాల వ్యాధి సమస్యలు ఇప్పుడు తెలంగాణలో ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఐసీఎంఆర్–ఇండియాబ్’అధ్యయనం రాష్ట్రానికి ఆందోళన కలిగించే సంకేతాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణలో కిడ్నీ పనితీరు లోపం ప్రాబల్యత 7.4 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 3.2 శాతంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యల ముప్పులో ఉన్నట్టు అంచనా. – సాక్షి, హైదరాబాద్
హెచ్చరికగా ఐసీఎంఆర్ అధ్యయనం
‘ఐసీఎంఆర్–ఇండియాబ్’ అధ్యయనం దేశవ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు ప్రబలడాన్ని గల కారణాలను అంచనా వేయడానికి చేపట్టిన అతిపెద్ద పరిశోధన. 2015 నుంచి 2023 మధ్యకాలంలో వివిధ దశల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా వయసు పైబడిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.
కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా చేసిన విశ్లేషణ ఫలితాలు ఇటీవలి కాలంలో శాస్త్రీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఇందులో తెలంగాణ దేశంలోని కిడ్నీ వ్యాధుల హాట్స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో జీవనశైలి మార్పుల ప్రభావం కిడ్నీలపై తీవ్రంగా పడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.
మధుమేహం–బీపీతో కిడ్నీలకు ముప్పు
మూత్రపిండాల వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మ«దుమేహం, రక్తపోటును వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటు కిడ్నీలపై నిరంతర ఒత్తిడిని పెంచి వాటి పనితీరును క్రమంగా బలహీనపరుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే మధుమేహం, రక్తపోటు కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కిడ్నీ సమస్యల సంఖ్య కూడా అధికమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇ
వే కాకుండా ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఉప్పు వినియోగం, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నొప్పి నివారణ మందుల విచ్చలవిడి వాడకం, ధూమపానం, మద్యపానం వంటి అంశాలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత, వేడి వాతావరణంలో తగినంత నీరు తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్క్రీనింగ్–చికిత్సపై ప్రభుత్వం దృష్టి
పెరుగుతున్న అసంక్రమణ వ్యాధుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా 30 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం, రక్తపోటు, ఇతర అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా కిడ్నీ సమస్యలకు దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.
ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలను విస్తరించడంతోపాటు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్రం అందుబాటులో ఉండేలా చూడాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల రోగులకు రవాణా ఇబ్బందులు లేకుండా హబ్ అండ్ స్పోక్ మోడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 67 కేంద్రాలలో రద్దీని తగ్గించడానికి, అదనంగా మరో 155 డయాలసిస్ యంత్రాలను (పడకలను) అందుబాటులోకి తెస్తున్నారు.
యువతలో పెరుగుతున్న కిడ్నీ కేసులు
గతంలో మూత్రపిండాల వ్యాధులు ప్రధానంగా వృద్ధుల్లో కనిపించేవి. ప్రస్తుతం 30–45 ఏళ్ల వయసు వారిలో కూడా ఈ సమస్యలు పెరుగుతున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఉద్యోగ ఒత్తిడి, అనియంత్రిత ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి.
మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న యువతలో కిడ్నీ పనితీరు క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకర అంశం ఏమిటంటే.. ప్రారంభ దశల్లో కిడ్నీ వ్యాధులకు పెద్దగా లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే వరకు చాలామందికి తమకు సమస్య ఉందనే విషయం తెలియదు. అందుకే దీనిని సైలెంట్ డిసీజ్గా వైద్యులు పేర్కొంటున్నారు.


