Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి

Khammam: Tammineni Krishnaiah Murder Eyewitness Muthesham Sensational Facts - Sakshi

సాక్షి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ముత్తేశం సంచలన నిజాలు వెల్లడించారు. మద్దులపల్లి దోబి ఘాట్‌కు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ఆటో తమ బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిపారు. బైక్‌పై ఉన్న ఇద్దరు పక్కనే ఉన్న గుంతలో పడిపోవడంతో.. ఆటోలో నుంచి నలుగురు కిందకు దిగి వేటకోడవళ్లతో కృష్ణయ్యపై దాడి చేసినట్లు తెలిపారు.

కృష్ణయను దారుణంగా నరకడాన్ని ప్రత్యక్షంగా చూశానని, కృష్ణ స్వామి, నూకల లింగయ్య,నాగేశ్వర్ రావు, మెంటల్ శ్రీను.. ఈ నలుగురు కత్తులతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆటోలో మొత్తం ఆరుగురు రాగా.. మిగతా ఇద్దరు ఆటోలోనే ఉన్నారన్నారు. హత్య చేసిన వారంతా కోటేశ్వర్ రావుతో తిరిగే వారేనని, కృష్ణయ్యను ను ప్లాన్ ప్రకారం హత్య చేశారని తెలిపారు.
చదవండి: తుమ్మల అనుచరుడి దారుణ హత్య 

‘తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర్ రావు తెల్దారపల్లిలో వేరే పార్టీ పెత్తనం ఉండనివ్వరు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తారు. వారిద్దరి హస్తం లేనిని కృష్ణయ్య హత్య జరగదు. తమ్మినేని కోటేశ్వర్ రావు హత్య జరిగిన తర్వాత మృతదేహం చూస్తూ  కారులో  వెళ్లిపోయారు. కారులో వెళుతున్న సమయంలో కోటేశ్వర్ రావు ఒక్కరే ఉండటాన్ని గమనించా.  నాపై కూడాదాడి చేసే ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న రాళ్లతో ఎదురుదాడి చేశాను. 

దాడి సమయంలో తనను చంపవద్దని కృష్ణయ్య రెండు చేతులు జోడించి వేడుకున్నారు. తాను ఏ తప్పు చేశాను ఎందుకు చంపుతారని అడిగారు. ఏమాత్రం కనికరం లేకుండా చేతులను నరికివేశారు. మెడపై బలంగా దాడి చేయడంతో నరాలు తెగి నేను చూస్తుండగానే కృష్ణయ్య ప్రాణాలు కోల్పోయారు. కళ్లతో చూస్తుండగానే 5 నిమిషాల్లోనే దాడి చేసి పరారయ్యారు.’ అని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top