ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం | Key Development In The Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

May 8 2024 7:58 PM | Updated on May 8 2024 8:29 PM

Key Development In The Phone Tapping Case

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు మొదటిసారి స్పందించారు. ప్రభాకర్‌రావుకు రెడ్‌ కార్నర్‌  నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తన వాదనలను అఫిడవిట్‌ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.

‘‘నేను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్‌ బాధితుడినే. కారణం లేకుండానే నన్ను నల్లగొండ నుంచి బదిలీ చేశారు. చాలా రోజులు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేసీఆర్‌ది, నాది ఒకే కులం అయినందున నన్ను నిందిస్తున్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. చికిత్స పూర్తయ్యాక ఇండియాకు వస్తా’’ అని ప్రభాకర్‌ రావు తెలిపారు.

కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్‌ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారమంతా ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.

మరోవైపు.. ఎస్‌ఐబీలో హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ‍కూడా ప్రభాకర్‌ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే ప్రణీత్‌ రావు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్‌ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్‌ రావు ట్యాపింగ్‌ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌ రావు అమెరికాకు వెళ్లిపోయారని  అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్‌ రావుకు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement