ఉద్యోగులకు 2 డీఏలు | Key decisions taken in cabinet meeting chaired by CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు 2 డీఏలు

Jun 6 2025 1:04 AM | Updated on Jun 6 2025 1:04 AM

Key decisions taken in cabinet meeting chaired by CM Revanth Reddy

గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలను వెల్లడిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌

తక్షణమే ఒకటి చెల్లింపు.. 6 నెలల తర్వాత రెండో డీఏ

మళ్లీ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ కమిటీలు 

ఉద్యోగులకు వైద్య సదుపాయం కోసం ట్రస్ట్‌ 

ప్రతి నెలా రూ. 700 కోట్ల మేర ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు 

సచివాలయంలో 12.5 శాతం నాన్‌ సెక్రటేరియట్‌ సర్వీసెస్‌ కోటా 

అంగన్‌వాడీల పదవీవిరమణ ప్రయోజనం రూ. 2 లక్షలకు పెంపు 

ఎన్నికల్లో బదిలీ అయిన ఉద్యోగులు తిరిగి సొంత స్థానాలకు బదిలీ 

హామ్‌ విధానంలో రాష్ట్రంలోని అన్ని రోడ్ల అభివృద్ధి 

కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో మెట్రో రైలు విస్తరణ 

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు 

వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు (కరువు భత్యం) చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనుంది. ఇక మరో డీఏను 6 నెలల తర్వాత చెల్లించనుంది. 

వచ్చే ఏప్రిల్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు 5 పెండింగ్‌ డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి రెండు డీఏలపైనే కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. 

సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలపై విస్తృతంగా చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. 

ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. 
ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్‌కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించి మిగిలిన వాటిని పరిశీలనకు స్వీకరించింది. 

ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లించనుంది. ఉద్యోగుల హెల్త్‌ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ప్రతి ఉద్యోగి నుంచి నెలకు రూ. 500 వసూలు చేయడంతోపాటు సమాన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ట్రస్ట్‌కు చెల్లించనుంది. ట్రస్ట్‌ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా ఇతర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ట్రస్ట్‌ ద్వారా వైద్య సదుపాయం కల్పించనున్నారు. 

ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏటా సెప్టెంబర్‌లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్‌ స్టేట్‌ కౌన్సిల్, అసోసియేషన్లను గుర్తించేందుకు ఒప్పుకుంది. ౖజీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. 

సచివాలయంలో ప్రస్తుతం పూర్తిగా సెక్రటరియేట్‌ సర్వీసెస్‌ ఉద్యోగులే పనిచేస్తుండగా ఇకపై 12.5 శాతం నాన్‌ సెక్రటరియేట్‌ సరీ్వసెస్‌ కోటాను అమలు చేయాలనే మరో డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదనే మరో డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ కార్యదర్శి పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. 

ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు తిరిగి పంపించేందుకు అంగీకరించింది. జిల్లా పరిషత్‌లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల పూర్తితోపాటు నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు డిమాండ్లకు సైతం సమ్మతి తెలిపింది. అంగన్‌వాడీల పదవీవిరమణ ప్రయోజనాలను రూ. 2 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుతోపాటు వాహనాల అద్దెల పెంపునకు ఆమోదం తెలిపింది. 

మరికొన్ని నిర్ణయాలు 
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించింది.  
– స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 385 మంది మరణించగా రూ. 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది.  

– హైబ్రీడ్‌ యాన్యూటీ మోడ్‌ (హామ్‌) కింద రాష్ట్రంలోని అన్ని (పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ) రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 7,947 కి.మీ. పంచాయతీరాజ్, 5,190 కి.మీ. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు కలిపి మొత్తం 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ. 16,780 కోట్లు, ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు రూ. 16,414 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. వచ్చే రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనుండగా 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకే ప్రభుత్వం అప్పగించనుంది. పార్లమెంట్‌ స్థానాన్ని ఒక యూనిట్‌గా లేదా ఉమ్మడి జిల్లాలవారీగా ఒక్కో జిల్లాను ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం. 

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 19,579 కోట్లతో అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్‌–1లో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కి.మీ., కారిడార్‌–2లో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కి.మీ., కారిడార్‌–3లో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 22 కి.మీ. కలిపి మొత్తం 86.1 కి.మీ. కారిడార్‌ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి పొంగులేటి కోరారు. 

– రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహాన్ని కొనసాగించాలని.. ప్రజలకు మేలు చేసే కార్యాక్రమాలకు గ్రీన్‌ చానల్‌లో చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. 
– ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement