ఐదు జవాబులు రాస్తే సరి.. | JNTU Technical Education Changes In Examination System | Sakshi
Sakshi News home page

ఐదు జవాబులు రాస్తే సరి..

Jan 6 2022 2:25 AM | Updated on Jan 6 2022 9:59 AM

JNTU Technical Education Changes In Examination System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది.

బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మంజూర్‌ హుస్సేన్‌ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.

గతానికి ఇప్పటికీ తేడా
సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్‌ గ్రౌండ్‌లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ) ఉండేది. పార్ట్‌–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్‌–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్‌ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది.

ఇప్పుడు ఒకే పార్ట్‌గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్‌కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్‌ మార్క్‌ 40 (ఇంటర్నల్స్‌తో కలిపి)గా నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement