
భట్టికి వినతిపత్రం ఇస్తున్న మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు
ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ఈనెల 12న మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు సోమవారం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న 57 సమస్యలను లిఖితపూర్వకంగా వివరించారు.
వాటి పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణలో భాగంగా భట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా.. భట్టి పైవిధంగా స్పందించారు. అలాగే తహసీల్దార్ల, ఎంపీడీఓల తిరుగు బదిలీల విషయాన్ని పరిష్కరిస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉద్యోగ జేఏసీ కో చైర్మన్ వంగా రవీందర్రెడ్డి, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.