ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..

Inter Student Throwing Baby Boy In The Trash At Nizamabad District - Sakshi

మగశిశువును చెత్తకుప్పలో పడేసిన ఇంటర్‌ విద్యార్థిని

ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూసిన శిశువు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్‌ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్‌వాడిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది.

అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top