కుల బహిష్కరణ చేసి.. అంత్యక్రియలకు దూరం
జగిత్యాల జిల్లా కందెనకుంటలో అమానవీయ ఘటన
జగిత్యాలక్రైం: కుల కట్టడితో ఓ కుటుంబాన్ని వెలి వేసి.. ఓ వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా రాకుండా దూరంగా ఉన్న కట్టుబాట్ల అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందెనకుంటలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదెల రాజేశం, కొమిరె పోశయ్య సమీప బంధువులు. పోశయ్య కుటుంబంలో ఓ సమస్య తలెత్తగా అండగా నిలవాల్సిన కుల పెద్దలు ఆ కుటుంబాన్ని గతంలోనే బహిష్కరించారు. ఓ అమ్మాయి విషయంలో ఏర్పడిన సమస్యను తమకు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు కులపెద్దలు ఆగ్రహించారు.
పోశయ్య కుటుంబం ఎవరి ఇళ్లకూ వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రాజేశం (40) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. పోశయ్య కుటుంబ సభ్యులు రాజేశం ఇంటికి వెళ్లారు. తమ మాట కాదని పోశయ్య, రాజేశం ఇంటికి వెళ్లాడన్న కోపంతో కులపెద్దలెవరూ అంత్యక్రియలకు రాలేదు. వారికోసం చాలాసేపు ఎదురు చూసిన రాజేశం కుటుంబ సభ్యులు చివరకు దగ్గరి బంధువులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వ్యక్తి చనిపోయినా దగ్గరకు రాని కుల సంఘం తీరును చూసి రాజేశం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఏఓ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్పూర్ ఎస్సై రాజు చెప్పారు.


