breaking news
inhuman
-
చచ్చినా.. వదలరా?
జగిత్యాలక్రైం: కుల కట్టడితో ఓ కుటుంబాన్ని వెలి వేసి.. ఓ వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా రాకుండా దూరంగా ఉన్న కట్టుబాట్ల అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందెనకుంటలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదెల రాజేశం, కొమిరె పోశయ్య సమీప బంధువులు. పోశయ్య కుటుంబంలో ఓ సమస్య తలెత్తగా అండగా నిలవాల్సిన కుల పెద్దలు ఆ కుటుంబాన్ని గతంలోనే బహిష్కరించారు. ఓ అమ్మాయి విషయంలో ఏర్పడిన సమస్యను తమకు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు కులపెద్దలు ఆగ్రహించారు.పోశయ్య కుటుంబం ఎవరి ఇళ్లకూ వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రాజేశం (40) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. పోశయ్య కుటుంబ సభ్యులు రాజేశం ఇంటికి వెళ్లారు. తమ మాట కాదని పోశయ్య, రాజేశం ఇంటికి వెళ్లాడన్న కోపంతో కులపెద్దలెవరూ అంత్యక్రియలకు రాలేదు. వారికోసం చాలాసేపు ఎదురు చూసిన రాజేశం కుటుంబ సభ్యులు చివరకు దగ్గరి బంధువులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వ్యక్తి చనిపోయినా దగ్గరకు రాని కుల సంఘం తీరును చూసి రాజేశం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఏఓ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్పూర్ ఎస్సై రాజు చెప్పారు. -
ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: స్లేవరీ అంటే బానిసత్వం. ఈ పదం వినగానే ఉత్తర అమెరికాలో నల్లజాతీయులు అనుభవించిన బానిసత్వం బతుకు గుర్తొచ్చి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా భారత్లో ఇప్పటికీ 1.80 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని 167 దేశాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బానిసలుగా జీవిస్తుంటే ఒక్క భారత్లోనే అత్యధికంగా 1.80 లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అంతేకాకుండా భారత దేశంలో సగానికి సగం జనాభా ‘మోడ్రన్ స్లేవరి లేదా ఆధునిక బానిసత్వం’ (వెట్టి చాకిరి)లో నివసిస్తున్నారట. ఇక్కడ వెట్టిచాకిరంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా యజమానుల బెదిరింపులకు భయపడి గొడ్డు చాకిరి చేస్తూ బతకడమని గ్లోబల్ స్లేవరి ఇండెక్స్ నిర్వచిస్తోంది. ఇటుక బట్టీల్లో, గనుల్లో వెట్టి చాకిరి చేయడం, బలవంతంగా వ్యభిచార వృత్తిలో కొనసాగడం, ఈ రెండు వృత్తుల్లో పనిచేసే వారు ఎక్కువగా చిన్నప్పుడే కిడ్నాపై రావడం ద్వారా జరుగుతుంది. బలవంతంగా బిచ్చమెత్తించడం కూడా బానిసత్వమే. ప్రభుత్వేతర సాయుధ దళాల్లో బలవంతంగా చేర్చుకోవడం, భవన నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యపరిశ్రమలోకి బాండెడ్ లేబర్గా పిల్లలతో పనిచేయడం కూడా ఆధునిక బనిసత్వమే. ఈ అన్ని రకాల ఆధునిక బానిసత్వం భారత్లో కొనసాగుతోంది. ఇంట్లో బట్టలుతికి, గిన్నెలు కడిగే పని మనుషులు కూడా ఈ ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇంకా దాన్ని ఈ కేటగిరీలో చేర్చలేదు. వారు కూడా లైంగిక దోపిడీకి, బెదిరింపులకు గురవుతున్న సందర్భాలు కూడా ఉండడం వల్ల వారిని కూడా ఈ కేటగిరీలో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. -
నిర్దయ భారతం
కుజ గ్రహాన్ని పరిశోధించేందుకు రాకెట్ను ప్రయోగించిన ఖ్యాతి మనది. ప్రపంచ దిగ్గజ దేశాలతో పోటీపడుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. అయినా.. నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో కునారిల్లుతున్నాం. అమాయకత్వం.. కడుపేదరికంతో మన దేశ గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారనడానికి ఈ చిత్రం ప్రత్యక్ష నిదర్శనం. ఒడిశాలోని కలహండి జిల్లాలో భార్య శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన ఓ భర్త వార్తకు సంబంధించిన ఫొటోను చూసి నెటిజన్ల హృదయం ఆర్ద్రమైంది. ఆ భర్త నడిచిన తీరును భారతదేశ పటంలా చిత్రించి ఓ నెటిజన్ తన వేదనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇపుడు ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతూ.. మన దేశ విధానాలను ప్రశ్నిస్తోంది.


