రండి.. రాజన్న సేవలో తరించండి!

Indrakaran Reddy Visits Vemulawada Temple In karimnagar - Sakshi

రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు

సేవలో లోటుపాట్లు రావొద్దు

వేములవాడ: పేదల దేవుడు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు  ముస్తాబైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం ఆలయ అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు జాగరణచేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వసతీసౌకర్యాలపై ప్రత్యేక    దృష్టి సారించింది. మంగళవారం రాత్రి నుంచే వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి,  ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ వేములవాడకు చేరుకుంటారు.   

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ‘మహా’ జాతర ఏర్పాట్లపై సమీక్ష

వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి మూడురోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ చైర్మన్‌ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. కోవిడ్‌–19 నిబంధనలు సడలించాక రాజన్న భక్తులు తమ ఇలవేల్పు వేములవాడ రావడం అధికమైందన్నారు. భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అందరికీ వసతి లభించేలా, మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నారు. శానిటైజర్లు, మాసు్కలు పంపిణీ చేయాలని చెప్పారు. వైద్యసేవలు అందించాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్టీవో శ్రీనివాస్‌రా వు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా, అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, తహసీల్దార్‌ మునీందర్, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, 14మంది ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల సేవలో నిమగ్నం కావాలని మంత్రి సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top