మలి విడతలో మరో 9,240 సీట్లు  | Increased computer science course seats EAMCET Counselling | Sakshi
Sakshi News home page

మలి విడతలో మరో 9,240 సీట్లు 

Sep 28 2022 5:39 AM | Updated on Sep 28 2022 5:39 AM

Increased computer science course seats EAMCET Counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 11 నుంచి జరిగే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నాటికి మరో 9,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 6,200 సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉండే వీలుంది. ఇవన్నీ కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులే. వీటన్నింటికీ ఇటీవల అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేని కోర్సుల స్థానంలో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. ఇందుకు అనుగుణంగా 89 కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నాయి. దీంతో 6 వేలకుపైగా ఈ సీట్లు తగ్గుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ నాటికి 71,286 సీట్లు అందుబాటులో ఉండగా, కొత్త సీట్లతో కలిపి ఈ ఏడాది కనీ్వనర్‌ కోటాలో 77,486 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 

కొత్త సీట్లపై కోటి ఆశలు 
తొలి దశలో సీట్లు పొందినా... మంచి కాలేజీ, మంచి బ్రాంచ్‌ కోసం మరో దఫా కౌన్సె లింగ్‌కు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది కంప్యూటర్‌ కోర్సు లపైనే దృష్టి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు లభించని విద్యార్థులు రెండో విడతలో మరోసారి వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. కొత్తగా 6,200 సీట్లు అందుబాటులోకి వచ్చి న నేపథ్యంలో మరింత మందికి ఈ బ్రాంచీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది.  

కంప్యూటర్‌ సైన్స్‌పైనే గురి 
ఎంసెట్‌ మొదటి విడత ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపులో కంప్యూటర్‌ సైన్స్, ఐటీ అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్‌ సై¯న్స్, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు కేటాయించగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 99.76 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే డేటాసైన్స్‌లో 99.64 శాతం, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు కేటాయించారు.

సివిల్, మెకానికల్, అలైడ్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లకు కేటాయింపులు జరగ్గా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 36.38 శాతం సీట్లు భర్తీ కాగా, మెకానికల్‌లో 31.92 శాతం, ప్లానింగ్‌లో 24.44 శాతం సీట్లు కేటాయించారు. అలాగే మైనింగ్, కెమికల్, ఫుడ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో 84.45 శాతం సీట్లు కేటాయించారు.   

Advertisement
 
Advertisement
Advertisement