జర్నలిస్టు భార్యపై ఏపీ పోలీసుల జులుం | Inappropriate behavior towards KV Reddy wife during his arrest | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు భార్యపై ఏపీ పోలీసుల జులుం

Jul 2 2026 4:30 AM | Updated on Jul 2 2026 4:30 AM

Inappropriate behavior towards KV Reddy wife during his arrest

విజయలక్ష్మిని చేయిపట్టి లాగుతున్న ఏపీ పోలీసులు

కేవీ రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన భార్యతోనూ అనుచిత ప్రవర్తన   

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నివసిస్తున్న జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డిపై (కేవీ రెడ్డి) బొబ్బిలి కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్‌ పేరుతో ఆయన భార్యపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితురాలి ఫిర్యాదుతో సరూర్‌నగర్‌ పోలీసులు ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.  

ఏప్రిల్‌లో నమోదైన కేసులో... 
కేవీ రెడ్డి రెడ్‌బుక్‌ రాజ్యాంగంతోపాటు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌పై ఆన్‌లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్‌ కండి రమేశ్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేవీ రెడ్డిపై బొబ్బిలి కోర్టు ఈ ఏడాది మే 5న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కేవీ రెడ్డిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపరచాల్సిందిగా బాడంగి పోలీసులను ఆదేశించింది. దీంతో బొబ్బిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చింది. 

బైరామల్‌గూడ మధురానగర్‌లో ఉన్న కేవీ రెడ్డి ఇంటికి రాత్రి 7.30 గంటలకు వెళ్లారు. అప్పుడు కేవీ రెడ్డి షార్ట్, బనియన్‌తో ఉండగా, ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా లాక్కొని బయటకు తీసుకొచ్చారు. తమ ఇంటికి వచ్చిన వారు దుండగులని, తన భర్తను కిడ్నాప్‌ చేస్తున్నారని భావించిన కేవీ రెడ్డి భార్య విజ యలక్ష్మి ఆర్తనాదాలు చేస్తూ పోలీసుల వాహనాన్ని అడ్డుకుంది. ఇదే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో తాము పోలీసులమని, కేవీ రెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉందని చెప్పారు. 

కారు వద్ద ఉన్న విజయలక్ష్మిని చేయి పట్టి లాగేయడంతోపాటు ఒడిసి పట్టుకున్న ఏపీ పోలీసులు ఆమె పట్ల అభ్యంతరకరంగా, అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై సరూర్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని విజయలక్ష్మిని పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా కోరి, ఏపీ పోలీసులనూ తీసుకువెళ్లారు. ఠాణాలో వారెంట్‌ కాపీతోపాటు తమ వివరాలు అందించిన ఏపీ పోలీసులు అక్కడ నుంచి కేవీ రెడ్డిని తమ కారులో తీసుకువెళ్లారు.ఏపీ పోలీసుల ప్రవర్తనపై విజయలక్ష్మి మంగళవారం రాత్రి 8 గంటలకు సరూర్‌నగర్‌ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement