
ఏటా రూ.500 కోట్ల మేర నష్టపోతున్న ఆబ్కారీ శాఖ
విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాల్లో రాష్ట్రంలోకి..
ఎక్కువగా ఢిల్లీ, గోవా, హరియాణాల నుంచే..
విదేశాల నుంచి దర్జాగా తెచ్చుకుంటున్న
మందుబాబులు ఎక్కడ పార్టీలు జరిగినా
పెద్దఎత్తున దొరుకుతున్న ఎన్డీపీఎల్
ఆదాయం కోసం బీర్లు, విస్కీ ధరలు పెంచుతున్న ప్రభుత్వం
మద్యం అక్రమ దిగుమతిపై మాత్రం చోద్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) దందా నడుస్తోంది. వాయు, రోడ్డు అనే తేడా లేకుండా వీలున్నన్ని మార్గాల్లో ఈ అక్రమ మద్యం తెలంగాణలోకి విచ్చలవిడిగా ప్రవే శిస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండిపడుతోంది. విదేశీ, ఇండియన్ మేడ్ ఫారి న్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) ముసుగులో జరుగుతున్న ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ దందాతో ఏటా ఖజానాకు రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు నష్టం వస్తోందని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. అయితే ఆదాయం పెంపు పేరుతో లిక్కర్, బీర్ల ధరలను పెంచుతున్న ప్రభుత్వం ఈ దందాను అరికట్టే విషయంలో మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడ అనుమతుల్లేని పార్టీలు జరిగినా, పెద్ద మొత్తంలో నాన్డ్యూటీ పెయిడ్ మద్యం కూడా పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం.
వీఐపీలే కాదు..ముఠాలు కూడా
ఎన్డీపీఎల్ రాష్ట్రంలోకి అనేక మార్గాల్లో ప్రవేశిస్తోంది. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు లీటర్ల వరకు మద్యం ఉండొచ్చనే నిబంధన ఉంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లి వచ్చే వారికి ఎయిర్పోర్టుల నుంచి మద్యం తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో వీఐపీలు ఎక్కువగా విదేశాల నుంచి మద్యాన్ని తెచ్చుకుంటారు. వీరికి తోడు ఈ మద్యం కోసం రాష్ట్రంలో ముఠాలు కూడా ఏర్పడ్డాయి. ఇతర దేశాల్లో ఖరీదైన విదేశీ మద్యం బాటిల్ రూ.12వేలు ఉంటుందని సమాచారం. అయితే, అదే మద్యాన్ని తెలంగాణలో రూ.25వేల వరకు అమ్మే వీలుంది. అదే బ్రాండ్ మద్యం ఇక్కడ అంత ధర పలుకుతుంది. దీంతో విదేశాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల వివరాలను సేకరించి వారితో తప్పనిసరిగా మద్యం తెప్పించేలా ఈ ముఠా సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లేదంటే ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులతో మద్యం కొనుగోలు చేయిస్తున్నారు.
ఈ మ ద్యాన్ని బయట అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. ఢిల్లీ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. హరియాణా, గోవా ల్లోనూ తెలంగాణతో పోలిస్తే మద్యం ధ రలు చాలా తక్కువ. ఇక్కడ ఐఎంఎఫ్ఎల్ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల నుంచి రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో మద్యం తెప్పిస్తున్నారు. ఏకంగా కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ బుక్ చేసి మరీ ఎన్డీపీఎల్ తెప్పిస్తున్నారని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. ఈవెంట్ మేనేజర్లు, పారీ్టల నిర్వాహకుల పేర్లతో ఈ మద్యాన్ని విచ్చలవిడిగా ఆమ్ముకుంటున్నా, ఎక్సైజ్ వర్గాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేవలం ప్రత్యేక డ్రైవ్లకు మాత్రమే ఎక్సైజ్ శాఖ పరిమితం కావడం గమనార్హం. ఆ డ్రైవ్లు ముగియగానే మౌనం వహించడం, ఎన్ఫోర్స్మెంట్ టీంల దాడులు సరిగా జరగకపోవడం, సరిహద్దు చెక్పోస్టులు నిరీ్వర్యంగా మారడం ఎందుకనే ప్రశ్నలకు ఆ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు.
స్పెషల్ డ్రైవ్లు సరిపోతాయా?
రాష్ట్రంలో డ్యూటీ చెల్లించని మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్లు మాత్రమే సరిపోవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. గతంలోనూ ఈ రకమైన డ్రైవ్లు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల కూడా ప్రత్యేక దాడులు నిర్వహించింది. సీనియర్ అధికారి షానవాజ్ ఖా సిం నేతృత్వంలో ఈ నెల 3వ తేదీ నుంచి వారం రో జుల పాటు ఎక్కడికక్కడ నిఘా పెట్టి విదేశీ మద్యం అమ్ముతున్న వారిని పెద్ద ఎత్తున గుర్తించింది.
వారి వద్ద నుంచి రూ.లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఈ డ్రైవ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ సెలబ్రిటీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం పట్టుబడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎల్ను నియంత్రించి ఎక్సైజ్ ఆదాయానికి గండి పడకుండా ఉండాలంటే స్పెషల్ డ్రైవ్ నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడికక్కడ నిఘా పెంచాలని, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద చెక్పోస్టులు పెట్టాలని, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్పోస్టులను మరింత పటిష్టం చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటేనే ఎన్డీపీఎల్ అరికట్టడం సాధ్యమవుతుందనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. మరి, ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే...!