పాత్ వే, పార్కులు నిర్మిస్తున్న హైడ్రా
ఇక్కడి నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు బోరబండ బస్తీ.. మరో వైపు ఐటీ కారిడార్... మధ్యలోని గుట్టల బేగంపేటలో మురికి కూపంగా ఉన్న సున్నం చెరువును హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఆక్రమణలతో 14.20 ఎకరాలకు కుంచించుకుపోగా... ఇప్పుడు 30.5 ఎకరాలకు విస్తరించింది. ఎక్కడా నిర్మాణాలు, నివాసాల జోలికి వెళ్లకుండా మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గుడిసెలు వేసుకుని ఉన్నవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చెరువు చుట్టూ ఆకర్షణలు
సున్నం చెరువు (Sunnam Cheruvu) చుట్టూ విశాలమైన బండ్పై పాత్వే సిద్ధమైంది. కూర్చునేందుకు రాతి కుర్చీలు అందుబాటులోకి తెస్తోంది. పిల్లలకు ఆట స్థలాలు, పచ్చిక మైదానం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తోంది. చెరువు చుట్టూ ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచుతోంది. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్, చెరువులో బోటింగ్ సైతం అందుబాటులోకి రానుంది. చెరువు గట్టు చుట్టూ సోలార్ లైట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువుకు ఆనుకుని ఉన్న కొండనూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది.
చదవండి: లింగమనేని సంజూష్ కేసు.. భారతి తల్లి ఆవేదన

ఆకర్షణీయంగా ఆంజనేయుని గుడి...
చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చెత్త, చెదారం.. దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న ఆంజనేయ గుడిని కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుమార్లు హైడ్రా సమావేశమైంది. గోపురం, ఆలయానికి వెళ్లే దారితో పాటు.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి పాత్ వే నిర్మించింది. గుడి ముందు వాటర్ ఫౌంటైన్లో ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.


