సాక్షి, హైదరాబాద్: ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. అంజయ్యనగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్ని కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇక ఎవరిని ఉపేక్షించం. ఈ భవనాలన్నీ నాలాల పక్కన ఉన్నాయి. 50 గజాల్లోనే ఏడేసి అంతస్తులు కట్టారు. నిబంధనలు అతిక్రమించిన భవనాలన్నీ కూలుస్తాం. భవనాలు అన్ని నాలాను ఆనుకునే నిర్మించారు. బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడు. 50 గజాల్లో భవనాలు కట్టి హాస్టళ్లకు ఇస్తున్నాడు’’ అని రంగనాథ్ తెలిపారు.
ఇదీ చదవండి: గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరి మృతి
ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందాడు. బిల్డింగ్ యజమాని అందుబాటులోకి రాలేదు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చారు. గతంలో హైడ్రాకు ఈ బిల్డింగ్ నిర్మాణంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏడు అంతస్తులు, ఒక పెంట్ హౌస్ మొత్తం ఎనిమిది అంతస్తులు బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. నాలాను అతిక్రమించి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తాం. హాస్టల్ బిల్డింగులు నిర్మించి రెంట్కు ఇస్తుంటాడు సాజిద్.. అతనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి’’ అని రంగనాథ్ పేర్కొన్నారు.


