పరిశోధనల హబ్‌గా హైదరాబాద్‌ | Hyderabad as a research hub | Sakshi
Sakshi News home page

పరిశోధనల హబ్‌గా హైదరాబాద్‌

Sep 1 2024 4:29 AM | Updated on Sep 1 2024 4:29 AM

Hyderabad as a research hub

మెటీరియల్స్‌ అభివృద్ధిలోస్వావలంబన సాధించాలి

డీఆర్‌డీవో మాజీచైర్మన్‌ సతీశ్‌రెడ్డి సూచన

ఐకాన్‌ భారత్‌ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

సాక్షి,హైదరాబాద్‌: సబ్‌మెరైన్ల తయారీలో వినియోగించే పదార్థాల అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయని ఇప్పుడు పరిశోధనలు, అభివృద్ధికి భాగ్యనగరం కేంద్రంగా ఉందని రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మాజీ చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీ–హబ్‌ వేదికగా ‘వేదజ్ఞానం, ఆధునిక సాంకేతికత’పై శ్రీవీటీ సంస్థ రజతోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఐకాన్‌ భారత్‌’అంతర్జాతీయ సదస్సును సతీశ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. 

ఈ సదస్సు ద్వారా విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్‌ను ‘విశ్వ గురువు’గా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాచీన శాస్త్రీయతకు ఆధునికతను కలిపే చక్కటి వేదిక ఇదని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భరత సాధించాలంటే ముందుగా మెటీరియల్స్, తయారీరంగంలో నూతన సాంకేతికత విషయంలో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. దేశీయంగా కీలకమైన మెటీరియల్స్‌ అభివృద్ధి చేయడంలో ఎంతో ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. 

సబ్‌మెరైన్ల తయారీలో, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వంటి విమానాల తయారీలో 80% ముడి పదార్థాలు భారత్‌లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతోందని చెప్పారు. శ్రీవీటీ నిర్వహిస్తున్న పరిశోధనల ద్వారా వివిధ మెటీరియల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, గత 25 ఏళ్లుగా ఈ వర్సిటీ దేశంలోని వివిధ సంస్థలతో కలసి పని చేసిందని చెప్పారు. 

ఈ సదస్సుకు గౌరవ అతిథిగా బిట్స్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌రావు హాజరయ్యారు. సదస్సులో టీ–హబ్‌ సీఈవో శ్రీనివాస్‌ మహంకాళీ, సీఎస్‌ఐఆర్‌ మాజీ డీజీ డాక్టర్‌ శేఖర్‌ మండే తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement