అత్యాధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్ | Hyderabad Leading Advanced Medical Innovations | Sakshi
Sakshi News home page

అత్యాధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

Jun 3 2026 11:30 PM | Updated on Jun 3 2026 11:30 PM

Hyderabad Leading Advanced Medical Innovations

సాక్షి,హైదరాబాద్‌: క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

పరిశోధన దశ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ దాకా అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే చోట కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా సమగ్ర కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.

సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం బోర్పట్ల గ్రామంలో రూ.1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘థెరానిమ్ బయోలాజిక్స్(Theranym Biologics)’ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఫార్మా రాజధాని హైదరాబాద్‌ను బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

రాబోయే రోజుల్లో బయోటెక్నాలజీ రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ జెనెటిక్స్ వంటి సాంకేతికతలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయన్నారు. ఫలితంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా.. తలెత్తే సవాళ్లను అధిగమించేలా.. దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ పాలసీ, వన్ బయో హబ్, గ్రీన్ ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ తదితర విప్లవాత్మక అడుగులు లైఫ్ సైన్సెస్ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడతాయన్నారు.

ఓ వైపు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు వారికి కావాల్సిన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బృహత్తర బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ ఫార్మా కంపెనీలకు పిలుపునిచ్చారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చే ప్రయాణంలో ‘థెరానిమ్ బయోలాజిక్స్’ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మరొక కీలక మైలురాయి అని.. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.

క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఇక్కడ ఉత్పత్తి చేసి... యూఎస్ సహా పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్టుగా వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా... కొత్తగా సుమారు1500 మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా, టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కంపెనీ ప్రతినిధులు కె. నిత్యానంద రెడ్డి, డా. మదన్ మోహన్ రెడ్డి, డా. శాతకర్ణి ఎమ్., డా. ఐ.ఎస్.ఆర్. రావు, సనత్ ఛట్టోపాధ్యాయ, డేవ్ మరాల్డో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement