సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో ఘటన
మోతె: భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మోతె మండలం బీక్యతండాకు చెందిన హలావత్ నాగులు (50), బూబ (46) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. నాగులు, బూబ దంపతులు కొంతకాలంగా మోతె మండల కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని.. బొక్క అమృతారెడ్డి అనే రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.
వీరు రోజూ ఇంటి నుంచి రెండు ఆవులను తోలుకొని పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేవారు. అయితే వీరు కౌలుకు చేస్తున్న భూమి సమీపంలో బుధవారం ఉదయం వరి నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ వీరిద్దరిని పూడ్చిపెట్టినట్లు గుర్తించి గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్ఐ బి.లచ్చిరెడ్డి తహసీల్దార్ బి.వెంకన్న ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
మృతులు నాగులు, బూబగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని చంపి పూడ్చిపెట్టి ఉంటారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా.. మంగళవారం రాత్రి నాగులు, బూబ దంపతులు రెండు ఆవులను తోలుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ నర్సింహ పరిశీలించారు.


