
అనారోగ్యం బారిన పడిన వ్యక్తిని ఇంట్లోకి అనుమతించని ఇంటి యజమాని
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవచ్ఛవంలా మారగా అతడిని అద్దె ఇంట్లోకి రానీయలేదు ఆ ఇంటి యజమాని. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు అతడిని శ్మశానవాటి కకు తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన రంగు గోపినాథ్ (45) స్థానిక నందికూడలి వద్ద టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లి సుజాత, ఆమె కుమారుడు అభిషేక్తో కలిసి ఏడాదికాలంగా ఎస్సీ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.
కొన్ని రోజుల క్రితం గోపి అనారోగ్యం బారిన పడ్డాడు. కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారం క్రితం గోపి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కరీంనగర్లో చికిత్స చేయించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. అప్పు చేసి రూ.50 వేల వరకు ఖర్చు పెట్టినా అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గోపిని తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. అయితే జీవచ్ఛవంలా ఉన్న గోపిని ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు కొన ఊపి రితో ఉన్న అతడిని ముందుగా శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు.
దయ చూపిన మున్నూరుకాపు సంఘం..
శ్మశాన వాటిక వద్ద పడుకోబెట్టిన గోపి పరిస్థితిని గమనించిన మున్నూరుకాపు సంఘం వారు సంఘం భవనంలో ఆశ్రయమి చ్చారు. గోపి దీనస్థితిని తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణ సాయం కింద రూ.10 వేలు, బీజేపీ నాయకుడు దామెర రాంసుధాకర్ రూ.10,500 ఆర్థిక సాయాన్ని అందించారు.