సాక్షి, సంగారెడ్డి: రేవంత్రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఈరోజు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిషేధిత జాబితాలో భూములు పెట్టిన తర్వాత సీఎం, మంత్రి పొంగులేటి ఏజెంట్లు కమిషన్ కోసం తిరుగుతున్నారన్నారు. రక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం.. భక్షకుడిగా మారిందని ఆరోపించారు.
కన్న తల్లి పాములా మారి కాటేస్తుందా..? చేసిన తప్పుకు సీఎం రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు... భూముల చుట్టూ సీఎం రేవంత్ తిరుగుతున్నారన్నారు.పేదల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్, ఆయన తమ్ముళ్లు కడుపు నింపుకుంటున్నారని కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయి. 58, 59 జీవోల పేరుతో కొందరు అధికారులు పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


