3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా | Green flag for dredging in 3 reservoirs | Sakshi
Sakshi News home page

3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా

Dec 26 2024 4:20 AM | Updated on Dec 26 2024 4:20 AM

Green flag for dredging in 3 reservoirs

కడెం, మిడ్‌ మానేరు, లోయర్‌మానేరు జలాశయాల్లో పూడికతొలగింపునకు త్వరలో టెండర్లు

కాంట్రాక్టర్లు భారీ యంత్రాలతోఇసుకను తవ్వి అమ్ముకునేవెసులుబాటు

మెట్రిక్‌ టన్ను ఇసుకకు కనీస బిడ్డింగ్‌ ధర రూ.406గా ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: కడెం, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు జలాశయాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్‌ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్‌ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. 

ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్‌ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీడబ్ల్యూఆర్‌డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్‌యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. 

నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్‌ ఈఎన్‌సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

పేరుకుపోయిన పూడిక 
రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. 

నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. 

దేశంలో పీఎం కిసాన్‌ సించాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. 

సర్కారుకు ఖర్చు లేకుండా.. 
జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్‌ డ్రెడ్జింగ్‌) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. 

అత్యధిక ధర కోట్‌ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది.  

పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు!  
జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement