జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బంగారు గుండు కోసం చితి మంటలు పూర్తిగా ఆరిపోకముందే ఇద్దరు దుండగులు నీళ్లు చల్లి బూడిదను సంచుల్లో నింపి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. శుక్రవారం సాయంత్రం ఓ మహిళ అంత్యక్రియలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్మశానానికి చేరుకున్న దుండగులు మహిళ తల భాగంపై నీరు పోసి మంటలు ఆర్పి బూడిదను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించడంతో దుండగులు బూడిద సంచులను వదిలేసి పరారైనట్లు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం, మహిళలు మృతిచెందినప్పుడు సంప్రదాయం ప్రకారం వారు ధరించే నల్లపూసల ఆభరణంలోని చిన్న బంగారు గుండును మృతురాలి నోట్లో ఉంచి అనంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ ఆనవాయితీని ఆసరాగా చేసుకుని దాదాపు రూ.10 వేల విలువైన ఆ బంగారు గుండు కోసం దుండగులు చితి బూడిదను వెదుకుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


