పట్టణాభివృద్ధికి నిధులివ్వండి: కేటీఆర్‌

Give Fund To Urban Development KTR To Cental Govt - Sakshi

తెలంగాణకు అండగా కేంద్రంనిలబడాలి..

చివరి బడ్జెట్‌లోరాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వండి

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని పట్ట ణాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్‌తోపా టు ఇతర మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు లేదా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆదివారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను గుర్తుచేశారు.

టీఎస్‌ బీ పాస్, మున్సి పాలిటీల సంఖ్య పెంపు, పచ్చదనం పెంపునకు 10% బడ్జెట్‌ కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రాజెక్టులను గుర్తుచేశారు. మెర్సర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో వరుసగా ఆరోసారి హైదరాబాద్‌ అత్యుత్తమ నగరంగా నిలిచిందని, వరల్డ్‌ గ్రీన్‌సిటీ అవార్డు లభించింద న్నారు. దేశ గౌరవ, ప్రతిష్టలను    విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే అయిన నేపథ్యంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మేర నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపి, ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి.
 హైదరాబాద్‌లో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టంకు ఖర్చయ్యే రూ.3,050 కోట్లలో 15% మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లు కేటాయించాలి.
 హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌లోని రూ.254 కోట్లు విడుదల చేయాలి.
హైదరాబాద్‌సహా ఇతర మున్సిపాలిటీల్లో రూ.3,777 కోట్లు ఖర్చయ్యే సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్, బయోమైనింగ్‌ వంటి ప్రాజెక్టుల కోసం కనీసం 20 శాతం అంటే రూ.750 కోట్లు కేటాయించాలి. 
హైదరాబాద్‌లో ఎస్‌టీపీలు, మురుగునీటి సరఫరా నెట్‌వర్క్‌కు ఖర్చయ్యే రూ.8,684 కోట్లలో మూడోవంతును కేంద్రం భరించాలి. ఎస్‌ఎన్‌డీపీకి రూ.240 కోట్లు కేటాయించాలి. 
హైదరాబాద్‌లో పారిశుధ్యం మెరుగు కోసం రూ.400 కోట్ల మేర స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ నిధులివ్వాలి. ఎస్‌ఆర్‌డీపీ రెండోదశ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, స్కైవేలు తదితరాలకు రూ.3,450 కోట్లు ఇవ్వాలి. 
హైదరాబాద్‌లో 104 లింకు రోడ్ల వ్యయంలో మూడోవంతు అనగా రూ.800 కోట్లు కేంద్రం భ రించాలి. జాతీయ రహదారి 65పై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లు కేటాయించాలి.
తెలంగాణ శానిటేషన్‌ హబ్‌కు రూ.100 కోట్లు సీడ్‌ ఫండింగ్‌ ఇవ్వడంతోపాటు జీహెచ్‌ఎంసీ మూడో విడత మున్సిపల్‌ బాండ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top