జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ.. | General Transfers Started At District Level | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..

Jul 16 2024 2:40 PM | Updated on Jul 16 2024 2:43 PM

General Transfers Started At District Level

ఫైల్ ఫోటో

జిల్లాలో 788 మంది ఉద్యోగులు
బదిలీలకు ఆప్షన్‌ ఇచ్చిన 256 మంది..
అన్ని కేటగిరీల్లో ఖాళీలు 155
పీఎస్‌ల ట్రాన్స్‌ఫర్లు నేటికి వాయిదా

జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్‌ఫర్‌కు ఆప్షన్‌ ఇచ్చుకున్నారు.

బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్‌) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.

ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బోన్‌ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్‌ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.

బదిలీలకు 256 మంది ఆప్షన్‌..
జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్‌ వాచ్‌మన్, ఎంఎన్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్‌మన్, ఫైర్‌మన్, థియేటర్‌ అసిస్టెంట్, వాటర్‌ మెన్, స్వీపర్‌ తదితరులు డిపార్ట్‌మెంట్‌ వారీగా 788 మంది ఉన్నారు.

ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్‌ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్‌ఫర్లు కోరుకున్నారు.

కలెక్టరేట్‌లో బదిలీ కేటాయింపులు
జిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ నేతృత్వంలో కలెక్టరేట్‌ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్‌ డీపీఓ అనిల్‌కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్‌ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్‌ కాపీలను అందించనున్నారు.

ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్‌ పంచాయతీ, జూనియర్‌ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement