
రైతులకు నిషేధిత బీజీ– 3
విత్తనాలు అంటగడుతున్న కేటుగాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. మాయమాటలతో రైతులను కొందరు వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్్కఫోర్స్ ఏర్పాటుచేసి, అక్కడక్కడా అరెస్టులు చేస్తున్నప్పటికీ.. మోసాలు ఆగడం లేదు. ఓ వైపు నిషేధిత బీజీ–3 (బోల్గార్డ్–3) విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ.. దిగుబడి ఇవ్వటంలేదని తిరస్కరించిన విత్తనాలను లూజ్గా రైతులకు అంటగడుతున్నారు.
నిషేధిత బీజీ–3 విత్తన కంపెనీలతోపాటు కొందరు దళారులు జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా దళారులు నిషేధిత బీజీ–3, లూజ్ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు.
ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలే తొలి టార్గెట్..
రాష్ట్రంలో వానకాలం సీజన్లో అత్యధికంగా పత్తి సాగు చేసేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ వానకాలం సీజన్లో 11 లక్షల ఎకరాల వరకు పత్తి సాగవుతుంది. 5 లక్షల ఎకరాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగయ్యే ఉమ్మడి జిల్లాల్లో మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్ ఉన్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే దళారులు ఈ జిల్లాలపై దృష్టి పెట్టారు.
ఇప్పటివరకు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనే సుమారు 5 టన్నుల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం కాగజ్నగర్లో రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల బీజీ–3 విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక నుంచి మంచిర్యాల వెళ్తున్న రూ.98.75 లక్షల విలువైన 3,750 కిలోల (3.7 టన్నులు) విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూలు, గద్వాలలో కూడా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దళారులు పోలీసులకు చిక్కారు.
నిషేధం మాటున దర్జాగా విక్రయాలు
దేశంలో బీజీ–1, బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలను మాత్రమే రైతులు సాగుచేయాలనే ఆంక్షలు ఉన్నాయి. భూసారం తీవ్రంగా దెబ్బ తినడంతోపాటు, వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో బీజీ–3 రకాలను నిషేధించారు. అయితే వీటిని అక్రమంగా ఉత్పత్తి చేస్తున్న కొన్ని సంస్థలు.. ఏజెంట్ల ద్వారా నేరుగా రైతులకు సరఫరా చేస్తున్నాయి.
బీజీ–2 సాగుచేస్తే విత్తనం నాటిన 60 రోజుల తర్వాత దోమ పోటు ఉంటుందని, బీజీ–3 అయితే పంట దిగుబడి పూర్తయ్యేంతవరకు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, దిగుబడి సైతం బీజీ–2 కంటే 30 శాతం ఎక్కువగా వస్తుందని రైతులను నమ్మిస్తున్నారు. దీంతో రైతులు వీటివైపు ఆకర్శితులవుతున్నారు. అనేక చోట్ల రైతులు బీజీ–2తో కలిపి బీజీ–3 విత్తనాలను సాగుచేస్తున్నారు. జీబీ–3 సాగును అధికారులు నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
బీజీ–2 హైబ్రిడ్ విత్తన పాకెట్ ధర రూ.901
బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గత సంవత్సరం 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, తాజాగా రూ. 37 పెంచి రూ. 901గా నిర్ణయించింది. ఏ కంపెనీకి చెందిన హైబ్రిడ్ విత్తన ప్యాకెట్ అయినా రూ.901లకే రైతుకు విక్రయించాలి.
ఈ నేపథ్యంలో లాభాల కోసం డీలర్లు దళారుల ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల పేరుతో నిషేధిత బీజీ–3 లూజ్ విత్తనాలను కిలోకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో తగిన దిగుబడి సామర్థ్యం లేవని పక్కన బెట్టిన విత్తనాలను తీసుకొచ్చి బీజీ–3 విత్తనాలతో కలిపి విక్రయిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో తేలింది.
నాణ్యమైన బీజీ–2 విత్తనాలే నాటాలి: వ్యవసాయ శాఖ
రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 45 వేల క్వింటాళ్ల బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలు అవసరం. అయితే, ఈ సీజన్లో రాష్ట్రంలోని అన్ని పత్తి విత్తన కంపెనీల వద్ద కలిపి 1,34,268 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది.