
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంతో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత సోదరి నివేదితకు ఓటమి ఎదురైంది.
సీనియర్ నాయకుడు జి.సాయన్న మరణంతో ఆయన వారసురాలిగా లాస్యనందిత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నారాయణ్ శ్రీగణేశ్ గెలిచారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక రెండేళ్లలోపునే రెండు ఉప ఎన్నికలు.. హైదరాబాద్లోనే కాదు.. బహుశా ఏ జిల్లాలోనూ జరిగి ఉండవు.