క్లిక్‌ చేయొద్దు.. బ్లాక్‌ చేయండి | Do not respond to suspicious messages on WhatsApp | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేయొద్దు.. బ్లాక్‌ చేయండి

Aug 19 2024 6:26 AM | Updated on Aug 19 2024 6:26 AM

Do not respond to suspicious messages on WhatsApp

వాట్సాప్‌లో అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందించవద్దు.. హెచ్చరించిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి వినియోగదారుడు తప్పక వాడే మొబైల్‌ యాప్‌ వాట్సాప్‌. ఇప్పుడు ఈ యాప్‌ను వేదికగా చేసుకుని సైబర్‌నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ వాట్సాప్‌లకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. అందులోని లింక్‌పై క్లిక్‌ చేసి, తాము చెప్పిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

తాజాగా ఇదే తరహాలో చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తిని రూ.5.4 కోట్లు మోసగించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. అయితే, పెట్టుబడుల పేరిట వాట్సాప్‌లో వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. షేర్‌మార్కెట్‌ పెట్టుబడులతోపాటు ఇతర యాప్‌లకు సంబంధించి వచ్చే లింక్‌లపైనా క్లిక్‌ చేయవద్దని చెబుతున్నారు.

అనుమానాస్పద మెసేజ్‌లు వాట్సాప్‌కు వస్తే వెంటనే ఆ నంబర్లను బ్లాక్‌ చేయాలని తెలిపారు. సైబర్‌నేరగాళ్ల నుంచి తరచూ ఈ తరహా మెసేజ్‌లు వస్తుంటే వెంటనే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో దృష్టికి ఆ నంబర్లు తీసుకురావాలని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్లను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుందని, సైబర్‌ నేరగాళ్ల చేతిలో మరికొందరు మోసపోకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement