హైదరాబాద్: దాదాపు 40 ఏళ్ల క్రితమే నగరంలో ఐటీకి బీజం వేసిన ‘ఇంటర్గ్రాఫ్’ భవనం కనుమరుగైంది. బేగంపేటలో ఒక ల్యాండ్మార్క్గా నిలిచిన ఈ భవనంలో భూగర్భ నీటి సంపు దెబ్బతినడంతో భద్రత దృష్ట్యా యాజమాన్యం దీనిని పూర్తిగా కూలి్చవేసింది. సత్యం, విప్రో, టీసీఎస్ వంటి సంస్థల కంటే ముందే ఇక్కడ ఇంటర్గ్రాఫ్ సంస్థ అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.
1980 దశకంలో బేగంపేటలో ఈ భవనం అప్పటి ప్రమాణాల ప్రకారం అత్యాధునిక ఐటీ కార్యాలయ సముదాయంగా గుర్తింపు పొందింది. పోస్ట్–మోడర్న్ కమర్షియల్ ఆర్కిటెక్చర్ ప్రభావంతో దీన్ని రూపొందించారు. ఐటీ సంస్థలకు కావల్సిన అత్యాధునిక వసతులు అప్పట్లోనే కల్పించారు.
గచ్చిబౌలిలో సైబర్ టవర్స్ ఏర్పడకముందే ఇంటర్గ్రాఫ్ రూపుదిద్దుకుందని, నగరంలో తొలి అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ అని చాలా మందికి తెలియదు. ఇక్కడి విజయాన్ని చూసిన తర్వాతే అనేక బహుళజాతి ఐటీ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. ఈ ఐకానిక్ భవనం స్థానంలో కమర్షియల్ బిల్డింగ్ నిర్మించే అవకాశం ఉంది.


