ఈ ఏడాది ట్విట్టర్‌లో దీని గురించే ఎక్కువ చర్చ..

Covid Is The Most Talked Topic On Twitter In 2020 - Sakshi

ఈ ఏడాది అత్యధికంగా ట్విట్టర్‌లో.. 

చర్చించింది కోవిడ్‌ మహమ్మారిపైనే.. 

తర్వాత సుశాంత్‌ మరణం.. 

హాథ్రస్‌ హత్యాచార ఘటనలపై

క్రీడల్లో ‘ఐపీఎల్‌2020’

సినిమాల్లో ‘దిల్‌బెచార’పై ఎక్కువగా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కోవిడ్‌ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ట్విట్టర్‌లో కూడా 2020లో అత్యధికంగా ప్రజలు చర్చించుకుంది దీని గురించే.. కోవిడ్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం, నిపుణులతో అనుసంధానం కోసంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్‌లో ప్రజలు విస్తృతంగా చర్చించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల పట్ల ఈ ఏడాది ప్రజలు కృతజ్ఞతలను ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు కృతజ్ఞతలు తెలపడం ప్రపంచ వ్యాప్తంగా 20% పెరగ్గా, ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం 135%, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30% పెరిగింది. మరికొన్ని రోజుల్లో 2020 ముగియనుండటంతో ఈ ఏడాది ట్విట్టర్‌ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలను సోమవారం ఆ సంస్థ బహిర్గతం చేసింది. చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్


ఇంకా సుశాంత్, హాథ్రస్‌ ఘటనలు..
సమకాలిక అంశాల (కరెంట్‌ అఫైర్స్‌)లో కోవిడ్‌–19 మహమ్మారి (#covid19) అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌ ట్వీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు నివాళి (# sushantsinghrajput) అర్పిస్తూ నెటిజన్లు పెట్టిన ట్వీట్లు రెండో అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌ ట్వీట్లుగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళితబాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన(# hathrs)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కూడా ట్విట్టర్‌లో విస్తృత చర్చ జరిగింది. మూడో అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌ ట్వీట్లు దీనిపై నెటిజన్లు చేశారు. చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్

క్రీడల్లో ‘విజిల్‌పొడు’కూడా..
ఇక క్రీడలకు సంబంధించిన అత్యధికంగా #ఐపీఎల్‌2020 గురించి ట్విట్టర్‌లో చర్చ జరగగా, ఆ తర్వాత మహేంద్రసింగ్‌ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీం హ్యాష్‌ట్యాగ్‌(# విజిల్‌పొడు), మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు ట్విట్టర్‌లో  # టీమిండియా హ్యాష్‌టాగ్‌తో విస్తృత అభినందనలు లభించాయి. 

గోల్డెన్‌ ట్వీట్లలో విజయ్‌తో అభిమానుల సెల్ఫీ!
ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్, కోట్‌ ట్వీట్స్‌ను పొందిన ట్వీట్లను గోల్డెన్‌ ట్వీట్లుగా ట్విట్టర్‌ ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ వేలాది మంది తన అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోను గత ఫిబ్రవరిలో ట్విట్టర్‌లో పోస్టు చేయగా, ఈ ఏడాది అత్యధిక రిట్వీట్స్‌ అందుకుని గోల్డెన్‌ ట్వీట్‌గా నిలిచింది. తమిళ సినీ అభిమానులు విస్తృతంగా ఈ ట్వీట్‌ను షేర్‌ చేశారు.భారతీయ క్రికెట్‌ జట్టు కెపె్టన్‌ విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకోవడానికి చేసిన ట్వీట్‌ ఈ ఏడాది అత్యధిక లైకులు అందుకుని గోల్డెన్‌ ట్వీట్‌గా నిలిచింది. 


‘సరిలేరు నీకెవ్వరు..’
ఇటు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన హిందీ సినిమా #దిల్‌బెచారపై ట్విట్టర్‌లో అభిమానులు అత్యధికంగా చర్చించారు. హీరో సూర్య నటించిన తమిళ సినిమా # సూరారిపొట్రును తమిళ సినీ అభిమానులు మాస్టర్‌ పీస్‌గా ప్రకటించారు. ఇక అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమాగా మహేష్‌బాబు, రష్మిక మందన్న నటించిన తెలుగు సినిమా # సరిలేరునీకెవ్వరు నిలిచింది. ఈ ఏడాది ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, టీవీ గురించి నిమిషానికి 700 ట్వీట్లు చేశారు.

బినోద్‌పై నవ్వులే నవ్వులే..
 ఇక #బినోద్‌( Binod) అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌ ట్వీట్లు అందుకున్న మీమ్‌(Meme of the year)గా నిలిచింది. సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులకు సంబంధం లేకుండా అసంబద్ధమైన, హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతుంటారు. ఇలానే ఓ పోస్టు కింద బినోద్‌ అనే వ్యక్తి తన పేరును కామెంట్‌గా పెట్టడంతో అతడి పేరు వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.

► కోవిడ్‌తో ప్రభావితమైన వారిని ఆదుకోవడానికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటిస్తూ టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా చేసిన ట్వీట్‌ విస్తృత ప్రశంసలు పొంది మరో గోల్డెన్‌ ట్వీట్‌గా నిలిచింది. 
►కోవిడ్‌ బారినపడి ఆస్పత్రిలో చేరినట్టు తెలుపుతూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేయగా, ఆయన త్వరగా కోలుకోవాలని భారీ సంఖ్యలో అభిమానాలు ‘కోట్‌ రీట్వీట్‌’చేయడంతో.. ఇది కూడా గోల్డెన్‌ ట్వీట్‌గా మారింది. 
►కోవిడ్‌ మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు కృతజ్ఞతగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన దీపాలు వెలిగిస్తూ పెట్టిన ట్వీట్‌.. రాజకీయ నేతల విభాగంలో అత్యధిక రీట్వీట్లు అందుకుంది. 
►క్రికెట్‌కు ధోని చేసిన సేవను కొనియాడుతూ ప్రధాని మోదీ పంపిన ప్రశంసా పత్రాన్ని ధోని ట్వీట్‌ చేయగా, అభిమానులు భారీ సంఖ్యలో రీట్వీట్‌ చేశారు. అత్యధిక రీట్వీట్లు పొందిన ఒక క్రీడాకారుడి ట్వీట్‌ ఇదే.. 


తీపి గుర్తులు యాది చేసుకున్నరు..
డీడీలో రామాయణం సీరియల్‌ను పున:ప్రసారం చేయడంతో చాలా మంది తమ పాత తీపి గుర్తులను #రామాయణ్‌తో ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా # పోకిరి.. మహాభారత్‌ సీరియల్‌ను మళ్లీ డీడీలో పున:ప్రసారం చేయడంతో # మహా భారత్‌.. అనే హ్యాష్‌ ట్యాగ్లతో ట్విట్టర్‌లో ప్రజలు చర్చించారు. వీటితో పాటు ప్రజలు # ఫొటోగ్రఫీ, #యోగా, # పొయెట్రీను సైతం బాగానే చర్చించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top