10 వేల పల్లెలపై కరోనా పడగ | Coronavirus Spread To 10000 Villages In Telangana | Sakshi
Sakshi News home page

10 వేల పల్లెలపై కరోనా పడగ

Oct 12 2020 1:59 AM | Updated on Oct 12 2020 1:59 AM

Coronavirus Spread To 10000 Villages In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలపై కోవిడ్‌ పడగ విప్పింది. నెల కిందటి వరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 10 వేల గ్రామాలకు వ్యాపించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాదాపు అన్ని గ్రామాల్లోనూ కేసులు నమోదైనట్లు అధి కారులు చెబుతున్నారు. పట్టణాల నుంచి పల్లెలవైపు కరోనా పరుగు తీసిందంటున్నారు. దీంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. ఎవరికి మహమ్మారి సోకిందో ఎవరికి లేదో అంతు పట్టక కొంతమంది జనం ఆందోళన చెందు తున్నారు. కొందరు సాధారణ జ్వరం అని పొరబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటు న్నారు. కొం దరు జ్వరం, దగ్గు సహా ఇతరత్రా లక్షణాలుంటే స్థానిక ప్రాక్టీషనర్‌ వద్ద చికిత్స తీసుకొని, ముదిరిన తర్వాత సమీప ఆసు పత్రులకు వెళ్తున్నారు. అక్కడ పరీక్షిస్తే కోవిడ్‌ అని బయటపడుతోంది. అప్పటికే వైరస్‌ తీవ్రత పెరిగి ప్రాణాపాయం ఏర్పడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరోగ్య కార్యకర్తల సర్వేలు
రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. కోలుకుంటున్నవారి సంఖ్య సైతం గణనీయంగానే ఉంది. అయితే, పాజిటివ్‌ కేసుల నమోదు మాత్రం పెరుగుతూనే ఉంది. నిర్ధా్దరణ పరీక్షల సంఖ్య పెరగడంతో బాధి తుల గుర్తింపు వేగంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి కోవిడ్‌ సంబంధ జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. అలాంటి వారిని ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనుమానిత లక్షణాలున్న వారిని బడులు, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేట్‌ చేస్తున్నారు. ఇతరులకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆధ్వర్యంలో 88 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి.

వాటిలో 8,114 పడకలు ఉన్నాయి. మరోవైపు నాలుగైదు కేసులు నమోదైతే కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1,283 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. అయితే యాదాద్రి, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కంటైన్మెంట్‌ జోన్ల వివరాలు పొందుపరచలేదు. అత్యధిక కేసులు నమోదవుతున్న మొదటి మూడు జిల్లాల్లో మేడ్చల్‌ ఉంది.

వృద్ధులపై తీవ్ర ప్రభావం...
ఊహించినట్లే గ్రామాల్లో వృద్ధులపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధా రణ లక్షణాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచా రంలో గత నెలన్నరలో 16 మంది చని పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అం దులో ముగ్గురు కోవిడ్‌తో మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. కేవలం 3 వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో అంత మంది చనిపోవడంపై స్థానికుల్లో ఆందోళన నెల కొంది. మృతుల్లో 11 మంది 60 ఏళ్లు పైబడినవారే. పోచారం ఘటన తన దృష్టికి వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలపగా, దీనిపై విచారణ చేయాల్సిందిగా జిల్లా వైద్యాధికారిని ఆదేశించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. గ్రామాల్లో విరివిగా కరోనా పరీక్షలు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement