కాంట్రాక్టు పోస్టుల నియామక ‘వివాదం’ | CMO orders intelligence inquiry | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు పోస్టుల నియామక ‘వివాదం’

Jul 3 2026 6:01 AM | Updated on Jul 3 2026 6:01 AM

CMO orders intelligence inquiry

జేఎన్‌టీయూహెచ్‌లో గందరగోళం..

ఇంటెలిజెన్స్‌ ఆరాకు సీఎంవో ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పోస్టుల నియామక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఇవ్వడంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్ళాయి. వైస్‌ చాన్స్‌లర్‌కు అనుకూలమైన వ్యక్తులు తమ అనుయాయులకు ఈ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్ళేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జేఎన్‌టీయూహెచ్‌ వర్గాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు సీఎంవోకు అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. తెర వెనుక సూత్రధారులపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న పలు అంశాలపై కూడా సీఎంవో దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిసింది.  

పాలక మండలి ఆగ్రహం: జేఎన్‌టీయూహెచ్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో 568 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 67 పోస్టులకు నెలకు రూ. 50 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా నియామకం చేపట్టే ముందు పాలక మండలిలో చర్చించాల్సి ఉంది. గతంలో ఏ యూనివర్శిటీలో పోస్టులు భర్తీ చేసినా ఈ నిబంధనలనే అనుసరించారు. జేఎన్‌టీయూహెచ్‌లో ముందు నియామకం చేపట్టి, ఆ తర్వాత పాలక మండలి ర్యాటిఫికేషన్‌కు పంపుతామని అధికారులు చెబుతున్నారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే యూనివర్సిటీ పరిధిలోని సుల్తాన్‌ పూర్‌లోనూ పాలక మండలి అనుమతి తర్వాతే నియామకాలు చేపట్టారు. పోస్టులకు రాత పరీక్ష కూడా లేకపోవడంతో అధికారుల ఇష్టానుసారం భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. పాలేరు కాలేజీలో చేపట్టిన టెండర్ల వ్యవహారం, యూనివర్శిటీలో ల్యాబ్‌ పరికరాల కొనుగోలులో అక్రమాలు, పలు పరీక్షల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులపైనా సీఎంవో విచారణ చేపట్టాలని నిర్నయించినట్లు తెలిసింది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement