8న యాదాద్రికి సీఎం రేవంత్‌ | CM Revanth Reddy To Visit Yadagiri Gutta on november 8th | Sakshi
Sakshi News home page

8న యాదాద్రికి సీఎం రేవంత్‌

Nov 4 2024 2:03 AM | Updated on Nov 4 2024 2:03 AM

CM Revanth Reddy To Visit Yadagiri Gutta on november 8th

మల్లన్నసాగర్‌–యాదాద్రి పైప్‌లైన్‌కు శంకుస్థాపన

సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రి జిల్లా పర్యటనకు రానున్నారు. అదేరోజు ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీఏ, జిల్లా అధికారులతో సమావేశమై యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మిగిలిపోయిన పనులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలిసింది. 

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచినీటిని సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టు పైలాన్‌ను యాదాద్రిలో సీఎం ప్రారంభిస్తారు. పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైప్‌లైన్‌ ద్వారా 550కి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తారు.

మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని బొల్లేపల్లి– సంగెం మధ్య భీమలింగం బ్రిడ్జి వద్దనుంచి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో కూడా సీఎం పర్యటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement