నేడు సీఎం ‘మూసీ’ యాత్ర | CM Revanth Reddy Musi Yatra: Telangana | Sakshi
Sakshi News home page

నేడు సీఎం ‘మూసీ’ యాత్ర

Nov 8 2024 6:09 AM | Updated on Nov 8 2024 8:04 AM

CM Revanth Reddy Musi Yatra: Telangana

పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలో పూజలు

సంగెంలో రైతులతో సమావేశం..సభ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రైతులతో కలిసి మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శించనున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తొలుత ఉదయం 8.45 గంటలకు కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుని తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్‌ పనులపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని సందర్శిస్తారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారు లతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. సంగెంలో 10 వేలమందితో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

గుట్టకు రెండోసారి
సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగు ట్టకు రావడం ఇది రెండోసారి. మొదట మార్చి 11న యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున మంత్రులతో కలిసి సందర్శించారు. కాగా శుక్రవారం సీఎం పర్యటన దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీ, జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సంగెం వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, యాదాద్రిలో ఈఓ భాస్కర్‌రావు ఏర్పాట్లు పరిశీలించారు.

ప్రజల జీవన స్థితిగతులు మార్చాలన్నదే ఆశయం: తుమ్మల
మూసీ పునరుజ్జీవం ద్వారా లక్షలాది మంది ప్రజల జీవన స్థితిగతులు మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఆశయమని మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంగెం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పరివాహక రై తులు, ప్రజలు, కులవృత్తుల వారి ఈతి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి మేలు చేసేందుకే సీ ఎం పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కార్య క్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement