‘ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం’ | CM Revanth Reddy To Inaugurate Experium Park | Sakshi
Sakshi News home page

‘ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం’

Jan 28 2025 3:10 PM | Updated on Jan 28 2025 3:53 PM

CM Revanth Reddy To Inaugurate Experium Park

సాక్షి,హైదరాబాద్‌ : ‘ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు,  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది.

దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం.రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది.

వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement