హైదరాబాద్: తనతో సహా ఉద్యోగులంతా మధ్య తరగతి వర్గానికి చెందిన వారేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులంతా సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచనని, అందుకే కార్మికులకు కోటి రూపాయల బీమా అందిస్తున్నామన్నారు. ఈరోజు(గురువారం) రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్.
దీనిలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బీమా రక్షణ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు బీమా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకూ సింగరేణిలో 45 మంది కార్మికులకు ప్రమాద బీమా అందించామన్నారు సీఎం రేవంత్. ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
తనను రేవంతన్న అని పిలిస్తే సంతోషంగా ఉంటుందన్నారు. తాను ఒకప్పుడు జెడ్పీటీసీనని, ఆ తర్వాత ఎంపీనని, ఇప్పుడు సీఎంనని రేవంత్ అన్నారు. పదవులు ఇలా మారుతూ ఉంటాయని, అందుచేత రేవంతన్న అనేది శాశ్వతంగా ఉంటుందన్నారు. తానొక గుంపు మేస్త్రినని, ఎవరు అవహేళన చేసినా పట్టించుకోననని, తమ మంత్రుల గుంపునకు తానే మేస్త్రినని రేవంత్ తెలిపారు.


