తెలుగులో రాత... మార్కుల్లో కోత! | Candidates doubts about Group1 Mains marks | Sakshi
Sakshi News home page

తెలుగులో రాత... మార్కుల్లో కోత!

Mar 12 2025 3:57 AM | Updated on Mar 12 2025 3:57 AM

Candidates doubts about Group1 Mains marks

గ్రూప్‌–1 మెయిన్స్‌ మార్కులపై అభ్యర్థుల అనుమానం 

తెలుగులో రాసినవారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపణ 

కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌–1లో అత్యధికంగా 530కి పైబడి మార్కులు వచ్చిన వారున్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలోని వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లిష్ లో పరీక్షలు రాసినవారు టాప్‌లో ఉన్నారని చెబుతున్నారు. 

మూల్యాంకనంలో ఇంగ్లిష్‌ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమమ్‌ మార్కులు వేయలేదని, ఫాక్ట్స్‌ రాసిన వాళ్లకు కొంత మేర మార్కులు ఇచ్చారని చెబుతున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసినవారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు. 

ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే... త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement