
నగరం నుంచి ఎదిగిన మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా..
నియోజకవర్గంలో విషాద ఛాయలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయాల్లో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎనీ్టఆర్ మీద అభిమానంతో మాగంటి గోపీనాథ్ 1983లో టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. కొద్ది కాలానికే ఎనీ్టఆర్ ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పని చేశారు. 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించిన మాగంటి గోపీనాథ్.. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు.
పార్టీల జిల్లా అధ్యక్షుడిగా...
టీడీపీలో ఉండగానే తొలుత 2014లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో చేరడానికి ముందు గోపీనాథ్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో సైతం 2022 నుంచి పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నగరంలో ఎందరో నేతలున్నప్పటికీ, కేసీఆర్ ఆయనకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించారంటే ఆయనకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారో అంచనా వేసుకోవచ్చు.
సినీ నిర్మాతగా..
మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా సినీ నిర్మాతగానూ గుర్తింపు పొందారు. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004,) నా స్టైలే వేరు (2009) సినిమాలను నిర్మించారు.
బుల్లెట్ వాహనాలతో ర్యాలీలు..
బుల్లెట్ బండ్లతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా మాగంటి తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. 1984లో ఎనీ్టఆర్ను సీఎం పదవి నుంచి దించినప్పుడు, అనంతరం 1985లో ఎనీ్టఆర్ తిరిగి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు బుల్లెట్ ర్యాలీలు నిర్వహించారు. ఏ పారీ్టలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల వేళ విభిన్న ప్రచారాలతోనూ ప్రత్యేకంగా నిలిచారు. ఆయా సందర్భాల్లో తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్, కేటీఆర్ల కటౌట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్పై గెలిచారు.
ఇక్కడే పుట్టి.. ఇక్కడే ఎదిగి
గోపీనాథ్ 1963, జూన్ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటరీ్మడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.