సిద్ధిపేట జిల్లా: సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నవ్వించే రీల్స్.. వాటికి జోడీగా బ్రహ్మానందం లాంటి హాస్య నటుల వీడియోలు జోడిస్తుంటారు. వాహనాల వెనుక ‘నన్ను చూసి ఏడవకురా.. నీ ఏడుపే నా ఎదుగుదల’ వంటివి చూస్తుంటాం. కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వినూత్నంగా ఫ్లెక్సీ పెట్టారు. ఆశ్చర్యకరంగా ముఖం పెట్టిన బ్రహ్మీ ఫొటోతో ‘అప్పు చేసి కడుతున్న బ్రో’ అనే వాక్యాన్ని జోడించాడు. అటువైపు వెళ్లే వా రు ఆ ఫ్లెక్సీలు చూసి నవ్వులు చిందిస్తున్నారు.
తల్లిమృతదేహం వద్ద కోతిపిల్ల
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి ప్రాణాలు కోల్పోయింది. తల్లి చనిపోయిన విషయం తెలియని పసికూన తల్లి మృతదేహాన్ని గట్టిగా హత్తుకుని ఒడిలోనే నిద్ర పోయింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.
– తంగళ్లపల్లి(సిరిసిల్ల)


