నత్తనడకన ప్రొ.జయశంకర్ బడిబాట
మంచిర్యాల అర్బన్: బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. వందశాతం నమోదు లక్ష్యం నీరుగారిపోతోంది. 2026–27 విద్యాసంవత్సరానికి మే 14నుంచి జూన్ 19వరకు బడిబాట నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉచితంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజనంపై విస్తృత ప్రచారం చేపట్టినా అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోలేదు.
ఈ ఏడాది లక్ష్యం ప్రకారం 17.08 శాతం వెనుకబడిపో వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య 21,39,006కు చేరడం లక్ష్యం కాగా 17,73,643 మాత్రమే అడ్మిషన్లు అయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి 2,28,990 మంది చేరగా 3,65,364మంది విద్యార్థుల నమోదు చేయాల్సి ఉంది. కాగా, మంచిర్యాల జిల్లా ప్రవేశాల లక్ష్య సాధనలో 86.19శాతం నమోదు చేసి అగ్రస్థానంలో నిలువగా పెద్దపల్లి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.


