తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌ బాధ్యతల స్వీకరణ

Anjani Kumar taken charge as Telangana DGP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా అంజనీకుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మహేందర్‌రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికే ఆదర్శం. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలి. క్విక్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. 

1990 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.

36 ఏళ్లలో13 మంది... 
1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత అంజనీకుమార్‌తో కలిపి మొత్తం 21 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు డీజీపీలు/ఇన్‌చార్జి డీజీపీలు అయ్యారు. వీరిలో 13 మందికి నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్‌ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్‌’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్‌ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్‌లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంజనీకుమార్‌ కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ/ఇన్‌చార్జి డీజీపీలుగా నియమితులైన ముగ్గురూ సిటీ కమిషనర్లుగా పని చేసిన వారే.

అంజనీ కుమార్‌ నిర్వర్తించిన పోస్టులు ఇవే.. 
- జనగామ ఏఎస్పీగా పనిచేశారు.
- కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు.
- ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు.
- నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు
- వరంగల్ ఐజీగా పనిచేశారు.
- హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 
- తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.
- 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు.
- 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top