అంతరించిపోతున్నఅరుదైన జంతువు | Alugu Animal Special Story | Sakshi
Sakshi News home page

అంతరించిపోతున్నఅరుదైన జంతువు

Jun 28 2025 12:33 PM | Updated on Jun 28 2025 12:59 PM

Alugu Animal Special Story

 

యథేచ్ఛగా అక్రమ రవాణా

డబ్బు కోసం హతమార్చుతున్న వేటగాళ్లు

అడవుల్లో రక్షణ కరువైన అలుగు 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అరుదైన జంతువు అలుగు (పంగోలిన్‌) ప్రమాదంలో పడింది. సంప్రదాయ వైద్యం, పలు ఉత్పత్తుల్లో వాడకం పేరుతో ఈ వన్యప్రాణిని వేటగాళ్లు హత మార్చుతుండడంతో అంతరించపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ములుగు, ఏటూరు నాగారం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుతో సహా పలు అటవీ ప్రాంతాల్లో గుట్టుగా వేటాడుతూ.. డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

వైల్డ్‌ లైఫ్‌ ట్రస్టు ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూటీఐ) సంస్థ, అటవీ అధికారులు తెలంగాణలో పలుచోట్ల రహస్యంగా మాటు వేసి నిందితులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అలుగులనే అత్యధికంగా వేటాడి అక్రమరవాణా చేస్తుండగా.. వీటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఐయూసీఎన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) ఈ వన్యప్రాణిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది.

వైవిధ్యం గల జీవి
శరీరంపై గట్టి పొలుసులు ఉండే అలుగు.. క్షీరదాల్లో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకారంలో ముంగిస తరహాలో ఉంటుంది. ఎదురుగా ఏదైనా కనిపిస్తే వెంటనే బంతి ఆకారంలో ముడుచుకు పోతుంది. సిగ్గరిగా, మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిపైనా ఎటువంటి దాడి చేయదు. కేవలం రాత్రి వేళ సంచరిస్తూ చెదలు, చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. వాసన, వినికిడి శక్తి అధికంగా ఉంటుంది.

శాస్త్రీయంగా నిరూపణ లేకున్నా
చైనాతో సహా పలు దేశాల్లో ఈ జీవి శరీర భాగాలను సంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వాడుతున్నారు. దీంతో అక్రమంగా అడవుల నుంచి రవాణా చేస్తూ పొలుసులు, మాంసాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది నాటు వైద్యులు.. ఈ జీవి శరీర భాగాలను మందులు, చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అటవీ సమీప ప్రాంతాల వారికి డబ్బు ఆశ చూపిస్తూ.. అలుగును అక్రమ రవాణా చేస్తున్నారు. కొన్నిసార్లు మధ్యవర్తులతో ఇతర దేశాలకు రవాణా జరుగుతోంది. పలు చికిత్సల్లో వాడుతున్నప్పటికీ రోగ నివారణపై శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాల్లేవని అటవీ, వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ స్వార్థం కోసం అరుదైన అడవి జంతువులను వేటాడొద్దని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గి పోయిందని.. భవిష్యత్‌లో మరింత ముప్పును ఎదుర్కోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఆగని అక్రమ రవాణా
గత మార్చిలో అలుగును వేటాడుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో ముగ్గురు పట్టుబడ్డారు. అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో పలు చోట్ల అలుగు అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో అలుగును అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అటవీ అధికారులకు చిక్కాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement