కారుచౌకగా కట్టబెట్టేశారు! | Allotment of Buggapadu Food Park lands to Andhra Pradesh company | Sakshi
Sakshi News home page

కారుచౌకగా కట్టబెట్టేశారు!

Jun 16 2026 4:48 AM | Updated on Jun 16 2026 4:48 AM

Allotment of Buggapadu Food Park lands to Andhra Pradesh company

ఏపీ కంపెనీకి బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ భూముల కేటాయింపు

బహిరంగ మార్కెట్‌లో ఎకరం ధర రూ.50 లక్షలు.. టీజీఐఐసీ ధర రూ.40.47 లక్షలు 

కానీ ఏపీకి చెందిన ‘దీపక్‌ నెక్స్‌ట్‌ జెన్‌’ కంపెనీకి ఎకరం కేవలం రూ.21 లక్షల చొప్పున ఏకంగా 72 ఎకరాలు ధారాదత్తం 

ఆ భూమికి పక్కనే ఉన్న భూమిని రైతు నుంచి ఎకరం రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన అదే కంపెనీ 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు 

భూ కేటాయింపులో స్థానికంగా ‘మంత్రాంగం’పై సర్వత్రా చర్చ 

ఆందోళనలకు సిద్ధమవుతున్న పార్టీలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కల్పిస్తుందని చెబుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టింది. ఇదే ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న భూమిని దారి కోసం ఓ రైతు నుంచి అదే కంపెనీ ఎకరం రూ.75 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఆ వెనకే టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) అధీనంలో ఉన్న 72 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.21 లక్షల చొప్పున రూ.15.12 కోట్లకే ప్రభుత్వం ధారాదత్తం చేయడం గమనార్హం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో జరిగిన ఈ తంతుపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతుండగా..ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి ఒకరు చక్రం తిప్పారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి లక్ష్యంగా.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతంలో జామ, మామిడి, అరటి, కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో బుగ్గపాడులో ఫుడ్‌పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రైతుల నుంచి 203 ఎకరాలు సేకరించి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఆపై భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించారు. ఫుడ్‌పార్కులో అన్ని వసతులున్నా.. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మొక్కజొన్న, మామిడి, కొబ్బరిపీచు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.  

అంత తక్కువ ధరకు ఎలా? 
బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో 72 ఎకరాల భూమి కేటాయిస్తే రూ.650 కోట్ల వ్యయంతో చేపలు, రొయ్యల దాణా తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ ఏర్పాటుకు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్‌ నెక్స్‌ట్‌ జెన్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. దీని యజమాని అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం కాగా..దీని ప్రధాన కార్యాలయం పూర్వపు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, బొమ్ములూరు గ్రామంలో ఉంది. విజయవాడలో కూడా వీరికి సంబంధించిన కార్యాలయం ఉండగా, మచిలీపట్నం, ఏలూరు, విశాఖపట్నంలో కూడా వీరి యూనిట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఒకరు..ఫుడ్‌ పార్క్‌లో ఎకరం రూ.21 లక్షలకే కేటాయించేలా చేశారని తెలుస్తోంది. సదరు మంత్రి తనయుడు బుగ్గపాడు ప్రాజెక్టులో స్లీపింగ్‌ పార్ట్‌నర్‌ అనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. 

కాగా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ భూమిలోకి త్వరగా చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో ఒప్పందం కన్నా ముందే రోడ్డు ఎదురుగా ఉన్న ఎకరం భూమిని ఓ రైతు వద్ద రూ.75 లక్షలకు ఆ కంపెనీ కొనుగోలు చేయడం గమనార్హం. కాగా అంత విలువున్న ఆ భూమిని ఆనుకుని ఉన్న టీజీఐఐసీ భూమిని ఎకరం రూ.21 లక్షలకు సదరు కంపెనీకి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి టీజీఐఐసీ ఎకరం ధర రూ.40.47 లక్షలుగా నిర్ణయించింది. మరోవైపు ఆ కంపెనీ రైతు నుంచి ఎకరం ఏకంగా రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఈ రెండూ కాదని రూ.21 లక్షల ధర ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అభివృద్ధి చేసిన విలువైన భూమిని ఈ విధంగా తక్కువ ధరకు అమ్మడంపై ప్రజాసంఘాలు, బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.  

రెండేళ్ల తర్వాత కంపెనీ ఆస్తే.. 
ఏపీ కంపెనీకి 72 ఎకరాలు ఇవ్వగా.. డీపీఆర్‌ ప్రకారం పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండేళ్ల తర్వాత కంపెనీ పేరుతో సేల్‌డీడ్‌ అవుతుంది. అంటే సదరు భూమి కంపెనీదే అవుతుందన్న మాట. స్థానికంగా రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న నల్లరేగడి భూముల ఎకరం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా సీతారామ ప్రాజెక్టు జలాలు అందే అవకాశముంది. సదరు కంపెనీ కూడా రైతుల భూములు ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీజీఐఐసీ ఇటీవల ఏప్రిల్‌ నుంచి జూన్‌ చివరి వరకు తమ అ«దీనంలో ఉన్న భూములకు చదరపు మీటర్‌ చొప్పున ధర నిర్ణయించగా.. బుగ్గపాడు భూమి ధర రూ.1,000గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరా కనీసం రూ.40.47 లక్షలకు కేటాయించాలని, అలా కాకుండా సగం ధరకే ఏకంగా 72 ఎకరాలు కట్టబెట్టడం వెనుక ‘మంత్రాంగం’ఉందనే చర్చ జరుగుతోంది. 

ఎవరూ ముందుకు రానందుకే.. 
కంపెనీ డీపీఆర్‌ను పరిశీలించాకే 72 ఎకరాల భూమి కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రెండేళ్లలో పూర్తిస్థాయి పరిశ్రమల ఏర్పాటుతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్‌లో పేర్కొన్నారు. బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో అన్ని వసతులు కల్పించి ఎకరం ధర రూ.40 లక్షలుగా నిర్ణయిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడి భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్థాయిలో ఏపీ కంపెనీకి ఎకరం రూ.21 లక్షలకు అప్పగించాలని నిర్ణయం జరిగింది. 
– అజ్మీరా స్వామి, జోనల్‌ మేనేజర్, టీజీఐఐసీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement